రేపు తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల

Mega DSC notification release in Telangana tomorrow

హైదరాబాద్‌ః తెలంగాణలోని రేవంతర్ రెడ్డి ప్రభుత్వం మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది. మొత్తం 11,062 ఉపాధ్యాయుల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి ఈరోజు నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. అయితే షెడ్యూల్ ఖరారు, సాఫ్ట్ వేర్ రూపకల్పనకు మెరుగులు దిద్దాల్సి ఉండటంతో ఒక రోజు ఆలస్యం కానుందని అధికారులు తెలిపారు. 11,062 పోస్టుల్లో 6,500 పోస్టులు ఎస్జీటీలే ఉన్నాయి. డీఎస్సీపై నిరుద్యోగులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే దాదాపు 4 లక్షల మంది ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణులయ్యారు. వీళ్లంతా డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు డీఎస్సీ ప్రక్రియలో ఎక్కడా ఎలాంటి సమస్య తలెత్తకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా సాఫ్ట్ వేర్ రూపకల్పనపై అధికారులు మరింత దృష్టి సారించారు.