సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సిపిలో గొల్లపల్లి సూర్యారావు చేరిక
అమరావతిః ఏపీ రాజకీయాల్లో పరిణామాలు చకచకా మారుతున్నాయి. టిడిపికి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వైఎస్ఆర్సిపి తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో గొల్లపల్లి వైఎస్ఆర్సిపిలో చేరారు. గొల్లపల్లికి వైఎస్ఆర్సిపి కండువా కప్పిన సీఎం జగన్ ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ ఎదుగుదల కోసం సేవలు అందించాలని సూచించారు.
ఇదే కార్యక్రమంలో పి.గన్నవరం టిడిపి నేత నేలపూడి స్టాలిన్ బాబు కూడా వైఎస్ఆర్సిపిలో చేరారు. స్టాలిన్ కు కూడా సీఎం జగన్ వైఎస్ఆర్సిపి కండువా కప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ప్రాంతీయ సమన్వయకర్త మిథున్ రెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా పాల్గొన్నారు.