హైదరాబాద్ లో మర్మాంగం కోసుకొని మెడికల్ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్ పాపిరెడ్డి నగర్ లో దారుణం చోటుచేసుకుంది. గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న దీక్షిత్‌రెడ్డి మర్మాంగం కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌ జిల్లా దేవరుప్పల గ్రామానికి చెందిన సోమి రెడ్డి, కరుణ దంపతులు 20 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ వచ్చి పాపిరెడ్డి నగర్‌లో స్థిరపడ్డారు. వీరికి ఒక కుమార్తెతో పాటు, కుమారుడు దీక్షిత్‌ రెడ్డి ఉన్నారు.

దీక్షిత్‌ రెడ్డి సికింద్రాబాద్‌ గాంధీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ సెకండ్ ఇయర్‌ చదువుతున్నాడు. అయితే దీక్షిత్‌ గత కొన్ని రోజులుగా మానసిక స్థితి బాగాలేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలోనే గతంలో ఓసారి నిద్రమాత్రలు తీసుకున్నాడు. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. ఈ క్రమంలోనే చికిత్స తీసుకుంటున్న దీక్షిత్‌ గత కొన్ని రోజులుగా మానసిక సమస్యతో బాధపడుతున్నాడు.

ఈ క్రమంలోనే ఆదివారం కుటుంబ సభ్యులు బయటకెళ్లిన సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. బయటకు వెళ్లిన కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి వచ్చే సమయానికి దీక్షిత్‌ రెడ్డి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. 108కి ఫోన్‌ చేయగా వచ్చి చూసిన సిబ్బంది.. దీక్షిత్‌ మర్మాంగం కోసుకొని మృతి చెందినట్లు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.