పెళ్లి కొడుకు ప్రాణం తీసిన పెళ్లి గిఫ్ట్

మాములుగా పెళ్లిలో బంధువులు , స్నేహితులు పెళ్లి గిఫ్ట్ లు ఇస్తుంటారు. ఆలా ఇచ్చిన ఓ పెళ్లి గిఫ్ట్ ఏకంగా పెళ్లి కొడుకు ప్రాణాలు తీయడమే కాదు వారి బంధువులను సైతం హాస్పటల్ పాలుచేసింది.

వివరాల్లోకి వెళ్తే..

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కబీర్‌ధామ్‌ జిల్లాలోని చమరి గ్రామానికి చెందిన యువకుడు హేమేంద్ర మేరవి, అంజానా గ్రామానికి చెందిన యువతికి శనివారం అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. బంధుమిత్రులు రకరకాల కానుకలు సమర్పించారు. వాటిలో ఒక హోమ్‌ థియేటర్‌ కూడా ఉంది. పెళ్లి మరుసటి రోజు (ఆదివారం) పెళ్లి కొడుకు తన కుటుంబసభ్యులు, దగ్గరి బంధువులతో కలిసి హోమ్‌ థియేటర్‌ను ఆన్‌ చేశాడు.

దాంతో అది ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో పెళ్లి కొడుకు హేమంద్ర మేరవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతని సోదరుడు రాజ్‌కుమార్‌తోపాటు మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పెళ్లికొడుకు సోదరుడు రాజ్‌కుమార్‌ కూడా మరణించాడు. మిగతా ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హోమ్‌ థియేటర్‌ ప్రమాదవశాత్తు పేలిందా లేదంటే ఇందులో ఏదైనా కుట్ర దాగి ఉందా అనే కోణంలోదర్యాప్తు మొదలుపెట్టారు.