మేడిగడ్డ కుంగుబాటుకు కెసిఆర్ బాధ్యత వహించాలిః మావోయిస్ట్ బహిరంగ లేఖ

నిర్మాణ సమయంలోనే పగుళ్లు పట్టినప్పటికీ బయటి ప్రపంచానికి తెలియనివ్వలేదన్న మావోయిస్టులు

maoist-letter-on-medigadda-barrage-issue

హైదరాబాద్‌ః మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్ కుంగడంపై మావోయిస్టులు బహిరంగ లేఖ విడుదల చేశారు. మావోయిస్టు జేఎమ్‌‌డబ్ల్యూపీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేశ్ పేరుతో ఈ లేఖ విడుదలైంది. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడానికి పూర్తి బాధ్యత సిఎం కెసిఆర్ వహించాలని అందులో పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీ అంతరాష్ట్ర వంతెన పిల్లర్ 30 మీటర్లు కుంగిపోవడానికి కారణం నాణ్యత లోపమేనని పేర్కొన్నారు. వేలాది కోట్లు ఖర్చు చేసి బ్యారేజీని నిర్మించి కేవలం మూడేళ్లే అయిందన్నారు.

2016 మే 2వ న నిర్మాణం చేపట్టగా, 2019 జూన్ 21న ప్రారంభించారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ బ్యారేజీ ఇలా కుంగిపోవడానికి కెసిఆర్ కుటుంబమే కారణమన్నారు. పెద్ద మొత్తంలో కమీషన్లు తీసుకుని నాసిరకంగా నిర్మించారని, నిర్మాణం సమయంలోనే పగుళ్లు ఏర్పడ్డాయన్నారు. కానీ ఈ విషయాన్ని అప్పుడు బయటి ప్రపంచానికి తెలియనివ్వలేదన్నారు.

ఈ ప్రాజెక్టు వద్దకు ప్రజలను, ప్రజాసంఘాలను, బూర్జువా పార్టీలను కూడా రానివ్వకుండా అడ్డుకున్నారన్నారు. పోలీసులతో ముందస్తు అరెస్టులు చేసి ధర్నాలు, ర్యాలీలు చేయకుండా అడ్డుకున్నారన్నారు. విషయం బయటకు రాకుండా అణిచివేశారని, మీడియాను బెదిరించి కంట్రోల్ చేశారన్నారు. ప్రజాధనం వృధా కావడానికి కెసిఆర్‌దే పూర్తి బాధ్యత అని ఆ లేఖలో పేర్కొన్నారు.