తెలంగాణలో పున:ప్రారంభమైన భారత్ జోడో యాత్ర

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణ లో పున: ప్రారంభమైంది. ఈ నెల 23న రాయచూర్ నుంచి రాహుల్‌ గాంధీ భారత్ జోడో పాదయాత్ర తెలంగాణలో అడుగుపెట్టారు. దీపావళి, ఖర్గే ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతల స్వీకరణ నేపథ్యంలో మూడు రోజుల పాటు రాహుల్ యాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఇక మూడు రోజుల విరామం అనంతరం ఈరోజు గురువారం ఉదయం మొదలైంది. మక్తల్ శివారులోని సబ్ స్టేషన్ నుంచి ఉదయం 6.30 గంటలకు భారత్ జోడో పాదయాత్రను రాహుల్ గాంధీ పునఃప్రారంభించారు. రాహుల్ ఈ సందర్భంగా కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూజలు చేయనున్నారు. ఈరోజు 26 కిలో మీటర్ల మేర రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. మధ్యాహ్న భోజనం అనంతరం 2.30 కి తెలంగాణ రైతులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు.

ఈరోజు రాహుల్ పాదయాత్ర మక్తల్.. కన్యకాపరమేశ్వరి దేవాలయం, పెద్ద చెరువు ట్యాంక్‌బండ్‌, దండు క్రాస్‌ రోడ్డుల మీదుగా కచ్వర్‌ గ్రామానికి చేరుకుంటుంది. మధ్యాహ్న భోజనం అనంతరం జక్లేర్‌ క్రాస్‌ రోడ్డు మీదుగా గుడిగండ్ల గ్రామానికి చేరుకుంటారు. అక్కడ జరిగే సభలో ప్రసంగిస్తారు. అనంతరం ఎలిగండ్ల వద్దకు చేరుకుని రాత్రి బస చేయనున్నారు.