బీజాపూర్‌-తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కీలక మావోయిస్టు మృతి

బీజాపూర్‌-తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కీలక మావోయిస్టు మృతి చెందాడు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో 23 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడంలో కీలకంగా వ్యవహరించిన హిడ్మా పోలీసుల కాల్పుల్లో మరణించాడు. తెలంగాణ గ్రేహౌండ్స్. CRPF కోబ్రా జాయింట్ ఆపరేషన్‌లో హిడ్మా మృతి చెందినట్టు తెలుస్తోంది. కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న హిడ్మా మృతితో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలినట్టు భావిస్తున్నారు. బీజాపూర్‌-తెలంగాణ సరిహద్దుల్లో బుధవారం ఈ భారీ ఎన్‌కౌంటర్‌ జరిగిందని.. ఈ జాయింట్ ఆపరేషన్‌లో మాడ్వి హిడ్మా హతమైనట్లు పేర్కొంటున్నారు.

ఛత్తీస్‌ఘడ్‌, తెలంగాణ, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో మావోయిస్టు కీలక వ్యూహకర్తగా హిడ్మా వ్యవహరించాడు. 1996-97లలో 17 ఏళ్ల వయసులో అతడు ఉద్యమం పట్ల ఆకర్షితుడై మావోయిస్టుల్లో చేరాడు. చత్తీస్‌గడ్‌లోని దక్షిణ బస్తర్ జిల్లా సుక్మా జిల్లాలోని పువర్తి హిడ్మా స్వగ్రామం. ఇతనికి సంతోష్, హిద్మల్లు వంటి మారు పేర్లు ఉన్నాయి. ఉద్యమంలోకి రాక ముందు హిడ్మా వ్యవసాయం చేసేవాడు. 7వ తరగతి వరకే చదువుకున్న హిడ్మా.. మావోయిస్టు పార్టీతో పని చేసిన ఓ లెక్చరర్ ద్వార ఇంగ్లీష్ నేర్చుకున్నారు. ఆయుధాల తయారీ, రిపైర్ వర్క్‌లో నిపుణుడిగా మారాడు. 2001-02 ప్రాంతాల్లో దక్షిణ బస్తర్ జిల్లా ప్లటూన్‌లో హిడ్మా ఎదిగాడు. 2007లో ఉర్పల్ మెట్ట వద్ద సీఆర్పీఎఫ్‌పై జరిగిన దాడిలో హిడ్మా కీలక పాత్ర పోషించాడు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో 23 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడంలో ఇతడే కీలక సూత్రధారి.