ఘోర రోడ్డు ప్రమాదం… 15 మంది విద్యార్థులు దుర్మరణం

విజ్ఞాన యాత్రకు వెళుతున్న విద్యార్థులు

Many students feared dead, several injured in bus accident in Manipur’s Noney

మణిపూర్ః మణిపూర్‌ రాష్ట్రంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో 15 మంది విద్యార్థులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే యారిపోక్‌ ప్రాంతంలోని ఓ పాఠశాలకు చెందిన విద్యార్థులు స్టడీ టూర్‌ కోసం ఖౌపుమ్‌కు రెండు బస్సుల్లో వెళ్తున్నారు. ఈ క్రమంలో నోనీ జిల్లాలోని బిస్నాపూర్‌-కౌపుమ్‌ రహదారి వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న ఓ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో 15 మంది విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 22 మందికి పైగా విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాద ఘటనపై మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరెన్‌సింగ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలికి ఎస్‌డీఆర్‌ఎఫ్‌, మెడికల్‌ సిబ్బందితోపాటు స్థానిక ఎమ్మెల్యే చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ మేరకు ప్రమాదానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/