ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సిబిఐ అధికారులు అరెస్ట్ చేసారు. ఈ కేసుకు సంబంధించి ఆదివారం 8 గంటలుగా మనీష్ సిసోడియాను సీబీఐ ప్రశ్నించింది. అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

మద్యం కుంభకోణంలో ఆయన ప్రమేయం ఉన్నట్లు సీబీఐ అధికారులు ముందు నుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తోన్నారు. ఇదివరకే ఆయనను విచారించారు కూడా. ఇవ్వాళ మరోసారి మనీష్ సిసోడియాను విచారణకు పిలిపించారు సీబీఐ అధికారులు. విచారణ అనంతరం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
సిసోడియా అరెస్ట్ నేపథ్యంలో ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. విచారణకు బయలుదేరి వెళ్లడానికి ముందు మనీష్ సిసోడియా నివాసానికి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆయనకు అండగా ఉంటామని ప్రకటించారు. మనీష్ సిసోడియాకు మద్దతుగా నినాదాలు చేశారు. ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, బీజేపీ, సీబీఐకి వ్యతిరేకంగా నినదించారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన సీబీఐ.. బుచ్చిబాబు,గౌతమ్ మల్హోత్రా సహా పలువురిని అరెస్ట్ చేసింది.