మరో వివాదంలో ఎమ్మెల్సీ కౌశిక్‌ రెడ్డి

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్‌ రెడ్డి పేరు నిత్యం వివాదాల్లో నిలుస్తుంటుంది. తాజాగా మరోసారి అలాగే నిలిచింది. కొన్ని రోజుల కిందట రైతు దినోత్సవం రోజున రైతుని తిట్టిన ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దాని గురించి ఇప్పుడిప్పుడే జనాలు మరచిపోతుండగా..ఇప్పుడు హుజూరాబాద్‌లో ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ కెమెరామెన్‌ను బండ బూతులు తిట్టిన వీడియో వైరల్ గా మారింది.

యూట్యూబర్ అజయ్‌ తనకు కౌశిక్‌రెడ్డితో ప్రాణహాని ఉందని సోషల్ మీడియా లో వీడియో విడుదల చేశారు. ఆ వీడియో లో ‘‘నేను గురువారం హుజూరాబాద్‌లో అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని కవర్‌ చేసేందుకు వెళ్లా. అక్కడ ఓ మహిళ ఎమ్మెల్సీని ఏదో సమస్యపై అడుగుతున్నారు. నేను అటువైపు వీడియో తీస్తుండగా కౌశిక్‌ అనుచరులు వీడియో తీసే సెల్‌ఫోన్‌ లాక్కెళ్లిపోయారు. అది తెచ్చుకోడానికి ఎమ్మెల్సీ కార్యాలయానికి వెళ్లగా ఎమ్మెల్సీ దుర్భాషలాడుతూ… దాడి చేశారు. కులం పేరుతో దూషించారు’ అని అజయ్‌ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.