ఏపీలో పరువు హత్య : కూతురు తల నరికిన తండ్రి

ఏపీలో పరువు హత్య చోటుచేసుకుంది. తన కూతురి వల్ల పరువు పోయిందని భావించిన తండ్రి ఆమె తల, మొండెం వేరు చేసిన ఘటన ఆలమూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దేవేంద్రరెడ్డికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ప్రసన్న(21) కు రెండేళ్ల క్రితం ఓ సాఫ్ట్ వర్ ఇంజనీర్ తో వివాహం చేసాడు. పెళ్లికి ముందే ప్రసన్న మరో వ్యక్తిని ప్రేమిస్తూ ఉండేది. అతనితో సాన్నిహిత్యం కారణంగా ఇటీవల హైదరాబాద్ నుంచి గ్రామానికి వచ్చేసింది. ఆమె తిరిగి భర్త దగ్గరకు వెళ్లలేదు. దీంతో తన పరువు పోయిందని భావించిన తండ్రి దేవేంద్ర రెడ్డి కుమార్తెపై కోపం పెంచుకున్నాడు.

ఈ నెల 10 న గొంతు నులిమి ప్రసన్నను హతమార్చాడు. అనంతరం మరికొందరితో కలిసి మృతదేహాన్ని కారులో నంద్యాల గిద్దలూరు మార్గంలో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి , తల, మొండెం వేరుచేసి తల ఒకచోట మొండెం మరోచోట పడేసారు. తిరిగి వచ్చి ఏం తెలియనట్లు ఉన్నాడు. ఈ మధ్య మనవరాలు ఫోన్ చేయకపోవడంతో తాత శివారెడ్డికి అనుమానం వచ్చి ప్రసన్న ఎక్కడికి వెళ్లిందని ఆరా తీశారు. దేవేంద్ర రెడ్డిని గట్టిగా నిలదీయడంతో పరువు పోయిందని కుమార్తెను చంపినట్లు తెలిపాడు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు గురువారం దేవేంద్ర రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రసన్న మృతదేహాన్ని పడేసిన ప్రాంతానికి తీసుకెళ్లి తల, మొండెంను స్వాధీనం చేసుకున్నారు.