కొమరంభీం జిల్లాలో ఘోరం : వడదెబ్బతో పెళ్లి కొడుకు మృతి

తెలంగాణలో ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. ఉదయం 7 గంటలకే కాలు బయటపెట్టలేని విధంగా భానుడు భగభగ మండుతున్నాడు. ఎండతీవ్రత ను తట్టుకోలేక ముసలివారే కాదు యువకులు సైతం వడదెబ్బకు మృతి చెందుతున్నారు. తాజాగా కొమరంభీం జిల్లాలో ఘోరం జరిగింది. వడదెబ్బతో పెళ్లి కొడుకు మృతి చెందాడు.

కౌటాల మండలం గుడ్లబోరి గ్రామానికి చెందిన శ్యాంరావ్-యశోద దంపతుల పెద్ద కుమారుడు తిరుపతి (32)కి మంచిర్యాల జిల్లా భీమినికి చెందిన యువతితో పెళ్లి కుదిరింది. బుధవారం పెళ్లి ముహూర్తం కాగా అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. అయితే, పెళ్లిపనుల్లో బిజీగా ఉన్న తిరుపతికి మంగళవారం వడదెబ్బ తగిలింది. దీంతో, కుటుంబసభ్యులు తొలుత అతడిని మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం, మెరుగైన వైద్యం కోసం కాగజ్‌నగర్‌కు తరలించారు. మంగళవారం రాత్రి తిరుపతి ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించడంతో మంచిర్యాలలోని మరో ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు తిరుపతి మృతి చెందాడు. మరికొద్ది గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన కుమారుడు..ఇలా మృత్యువు వాత పడడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.