తీన్మార్‌ మల్లన్నకు హైకోర్టు బెయిల్‌

దాదాపు రెండు నెలలకుపైనే జైల్లో ఉన్న మ‌ల్ల‌న్న‌

హైదరాబాద్ : జ‌ర్న‌లిస్టు తీన్మార్‌ మల్లన్న (చింతపండు నవీన్‌)కు ఎట్ట‌కేల‌కు బెయిల్ లభించింది. దాదాపు రెండు నెలలకుపైనే ఆయన జైల్లోనే రిమాండ్‌లో ఉంటోన్న విష‌యం తెలిసిందే. కల్లు వ్యాపారిని బెదిరించి డబ్బులు వసూలు చేశార‌న్న ఆరోప‌ణ‌ల‌తో పాటు ప‌లు కేసులు మల్లన్నపై న‌మోద‌య్యాయి. హైదరాబాద్‌ చిలకలగూడతో పాటు రాష్ట్రంలోని ప‌లు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో తీన్మార్‌ మల్లన్నను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అప్ప‌టి నుంచి జైలులోనే ఉంటున్నారు. బెయిల్ కోసం ఆయ‌న ఇంత‌కు ముందు చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. చివ‌ర‌కు తీన్మార్‌ మల్లన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఈ రోజు బెయిల్‌ మంజూరు చేసింది. కాగా, తన భర్తపై అక్రమ కేసులు పెట్టార‌ని మల్లన్న భార్య ఇటీవల కేంద్ర‌ హోంమంత్రి అమిత్ షాను కూడా కలిశారు. జాతీయ బీసీ కమిషన్ కూడా కేసుల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని బీజేపీ తెలంగాణ నేత‌లు మండిప‌డ్డారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/