రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం..ప్యాసింజర్ బోగీలకు అంటుకున్న మంటలు

Major fire at Kazipet railway station in Telangana

వరంగల్‌ః కాజీపేట రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గూడ్స్ ట్రైన్ బొగ్గు వ్యాగన్ లో నిప్పంటుకుని పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు చెలరేగి పక్కనే నిలిపి ఉంచిన ప్యాసింజర్ రైలుకు అంటుకున్నాయి. దీంతో పలు బోగీలు మంటల్లో కాలిపోయాయి. ఈ ప్రమాదంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు స్టేషన్ నుంచి బయటకు పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో రెండు బోగీలు పూర్తిగా కాలిపోయాయని అధికారులు తెలిపారు. స్టేషన్ లోని ప్లాట్ ఫాంలకు దూరంగా ఉన్న పార్కింగ్ ట్రాక్ లపై ఈ అగ్ని ప్రమాదం జరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు. గూడ్స్ రైలులోని బొగ్గుకు నిప్పంటుకోవడంతో మంటలు ఎగిసిపడ్డట్లు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు.