అయోధ్య రామమందిరంలోని గర్భ గుడిలోకి చేరిన ‘రామ్ లల్లా’ విగ్రహాం

వేద మంత్రోచ్చారణ, జై శ్రీరామ్ నినాదాల మధ్య ఆలయంలోకి విగ్రహం చేరవేత

main-idol-brought-into-the-garbh-griha-of-ram-temple-in-early-hours-of-thursday

అయోధ్యః అయోధ్య రామాలయం గర్భగుడిలోకి ప్రధాన విగ్రహం ‘రామలల్లా’ (బాల రాముడు) చేరింది. వేద మంత్రోచ్చారణ, జై శ్రీరామ్ నినాదాల మధ్య గురువారం తెల్లవారుజామున విగ్రహాన్ని ఆలయంలోకి తీసుకొచ్చినట్టు శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ప్రకటించారు. విగ్రహాన్ని ట్రక్కులో ఆలయానికి తీసుకొచ్చి ఓ క్రేన్ సాయంతో గర్భగుడిలోకి చేర్చినట్టు వివరించారు. కాగా, విగ్రహాన్ని గురువారం గర్భగుడిలో ప్రతిష్ఠించే అవకాశాలున్నాయని మిశ్రా తెలిపారు. జనవరి 22న ‘ప్రాణప్రతిష్ఠ’ వేడుకకు ముందు వరకు పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారని తెలిపారు. ప్రస్తుతం ఏడు రోజుల పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

జనవరి 21 వరకు పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని, ‘ప్రాణప్రతిష్ఠ’ రోజున కూడా కొన్ని కార్యక్రమాలు ఉంటాయని ట్రస్ట్ అధికారులు తెలిపారు. కాగా రామాలయం ‘ప్రాణ ప్రతిష్ఠ’ మధ్యాహ్నం 12:20 గంటలకు మొదలై మధ్యాహ్నం 1 గంటలోపు ముగియనుంది. అంతకుముందు బుధవారం ప్రధాన విగ్రహం ప్రతీకాత్మక ప్రతిరూపాన్ని ఆలయంలోకి తీసుకొచ్చారు. ‘కలశ పూజ’ నిర్వహించారు. ప్రస్తుతం 121 మంది ‘ఆచార్యులు’ ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన క్రతువులను నిర్వహిస్తున్నారు.