టిడిపిలో చేరిన మహాసేన రాజేశ్

మహాసేన రాజేశ్ కు టిడిపి కండువా కప్పిన చంద్రబాబు

mahasena-rajesh-joins-tdp-in-the-presence-of-chandrababu

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దళిత నేతగా గుర్తింపు తెచ్చుకుంటున్న మహాసేన రాజేశ్ టిడిపిలో చేరారు. సామర్లకోటలో ఈరోజు చంద్రబాబు దళిత సామాజికవర్గంతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో మహాసేన రాజేశ్ టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. రాజేశ్ కు పార్టీ కండువా కప్పిన చంద్రబాబు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గత కొంతకాలంగా మహాసేన రాజేశ్ వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వ విధానాలను సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తుండడం తెలిసిందే. నేడు టిడిపిలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చీకటి వచ్చిన తర్వాతే వెలుగు విలువ తెలుస్తుందని, జగన్ అస్తవ్యస్త పాలన చూశాక చంద్రబాబు పాలన ఎంత గొప్పదో అర్ధమవుతోందని వ్యాఖ్యానించారు.

జగన్ 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబును దళితద్రోహిగా పేర్కొన్నారని, తాము కూడా జగన్ మాటలు నిజమే అని భావించామని, కానీ త్వరలోనే నిజమైన దళిత ద్రోహి ఎవరో గుర్తించామని మహాసేన రాజేశ్ పేర్కొన్నారు. జగన్ మాటలు నమ్మి చంద్రబాబును అపార్థం చేసుకున్నామని విచారం వ్యక్తం చేశారు. ఎస్సీలకు 27 పథకాలు అమలు చేసిన వ్యక్తి చంద్రబాబు అని, దళితులు ఆత్మాభిమానంతో బతికేలా చేసేందుకు ఎన్నో చర్యలు చేపట్టారని కొనియాడారు. అయితే జగన్ రాగానే ఆ పథకాలను రద్దు చేశారని ఆరోపించారు.