వైజాగ్ లో రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయిః లోకేశ్
అమరావతిః ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతలను కాపాడటంలో జగన్ సర్కారు విఫలమైందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోమవారం ఆరోపించారు. వైజాగ్ సిటీలో రౌడీ మూకలు రెచ్చిపోతున్నా అదుపు చేయలేకపోవడమే దీనికి ఉదాహరణ అని చెప్పారు. ఈమేరకు సోమవారం లోకేశ్ ఓ వీడియోను ట్విట్టర్ లో పంచుకున్నారు. పట్టపగలు, నడిరోడ్డుపైన రౌడీలు రెచ్చిపోతూ కత్తులను బహిరంగంగా ప్రదర్శిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో క్రిమినల్ గ్యాంగులకు చట్టాలన్నా, పోలీసులన్నా భయంలేకుండా పోయిందని, ప్రభుత్వ అసమర్థతే దీనికి కారణమని లోకేశ్ ఆరోపించారు. అధికార పార్టీ ఇలాంటి రౌడీలను పెంచి పోషిస్తోందని, తద్వారా రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని ప్రయత్నిస్తోందని నారా లోకేశ్ తీవ్రంగా మండిపడ్డారు.