ఆళ్ల రామకృష్ణారెడ్డి పై నారా లోకేశ్ విమర్శలు
సహజ వనరుల దోపిడీలో జగన్ ను ఆళ్ల ఆదర్శంగా తీసుకున్నాడని విమర్శలు
అమరావతిః టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. సహజ వనరుల దోపిడీలో జగన్ ను ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆదర్శంగా తీసుకున్నారని అన్నారు. రుషికొండకు జగన్ గుండు కొడితే, ఆళ్ల ఏకంగా ఉండవల్లి కొండను మింగేశారని విమర్శించారు.
ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలోనే ఆళ్ల మైనింగ్ మాఫియా జరుగుతోందని లోకేశ్ తెలిపారు. ఉండవల్లి కొండను మాయం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రావెల్ దోపిడీని బయటపెట్టిన మంగళగిరి టిడిపి నేతలను అభినందిస్తున్నానని లోకేశ్ పేర్కొన్నారు.