ఈరోజు మధ్యాహ్నం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌

lok-sabha-election-2024-polls-schedule-to-be-announced-today

న్యూఢిల్లీ : యావత్‌ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికలు-2024, పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ నేడు విడుదల కానున్నది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ‘జ్ఞాన్‌ భవన్‌’లో మీడియా సమావేశం నిర్వహించి షెడ్యూల్‌ ప్రకటించనున్నది. శుక్రవారం ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి ఒకరు సోషల్‌మీడియా ‘ఎక్స్‌’ వేదికగా అధికారికంగా వెల్లడించారు. లోక్‌సభతో పాటు, ఆంధ్రప్రదేశ్‌ సహా నాలుగు రాష్ర్టాల అసెంబ్లీల ఎన్నికల తేదీలను కూడా ప్రకటించనున్నారు. ప్రస్తుత లోక్‌సభకు జూన్‌ 16వ తేదీతో గడువు ముగియనున్నది.

ఈసీ డాటా ప్రకారం..అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీల గడువు జూన్‌ 2వ తేదీతో, ఆంధ్రప్రదేశ్‌-జూన్‌ 16వ తేదీతో, ఒడిశా అసెంబ్లీ గడువు జూన్‌ 24వ తేదీతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నాలుగు రాష్ర్టాల అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందుకోసం ఇటీవల దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో పర్యటించిన ఈసీ..స్థానిక రాజకీయ పార్టీలు, క్షేత్రస్థాయిలో అధికారులతో విస్త్రత సమావేశాలు నిర్వహించింది. అనంతరం షెడ్యూల్‌ను సిద్ధం చేసింది. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన వెంటనే ‘మాడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌’ అమల్లోకి రానున్నది. కోడ్‌ అమల్లోకి వచ్చిన వెంటనే అధికారంలో ఉన్న పార్టీలు కొత్తగా ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుండదు.