‘క్విట్ చంద్రబాబు’ నినాదంతో ఎన్నికలకు వెళ్తాం: మంత్రి రోజా

ఏపీలో రాజకీయ వేడి రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ , ఇప్పటి నుండే పార్టీల నేతలు ప్రజల వద్దకు వెళ్తున్నారు. సభలు , సమావేశాలు , పర్యటనలు చేస్తూ విమర్శలు , ప్రతి విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. తెలుగుదేశం నేత నారా చంద్రబాబు బాదుడే బాదుడు అంటూ జిల్లాల పర్యటన చేస్తూ వైస్సార్సీపీ సర్కార్ ఫై నిప్పులు చెరుగుతున్నారు. ఈ తరుణంలో ‘క్విట్ చంద్రబాబు.. సేవ్ ఆంధ్రప్రదేశ్’ నినాదంతో 2024 ఎన్నికలకు వెళ్తామని మంత్రి రోజా అన్నారు.

చంద్రబాబు నిన్న కడపలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్, వైసీపీ పాలనపై ఆయన ఘాటు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వ్యాఖ్యలపై రోజా స్పందిస్తూ… కుప్పంలో జరిగిన అభివృద్ధి, పులివెందులలో జరిగిన అభివృద్ధికి మధ్య ఉన్న తేడాను గమనించాలని చెప్పారు. చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు.

14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నప్పటికీ కుప్పంను కనీసం రెవెన్యూ డివిజన్ గా కూడా చేయలేని అసమర్థుడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. తాము ప్రజల్లో ధైర్యంగా తిరుగుతున్నామని… టీడీపీ నేతలు మీడియా ముందు డ్యాన్స్ చేస్తున్నారని విమర్శించారు.