మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం : మంత్రి అవంతి

విశాఖపట్నంలో మంత్రి అవంతి శ్రీనివాస్ వాహనం ఢీకొని ఒక‌రి మృతి

అమరావతి: విశాఖపట్నంలో నిన్న‌ ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ వాహనం ఢీకొని సూర్యనారాయణ అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఈ రోజు ఉదయం అవంతి ఇంటి ముందు మృతుడి కుటుంబ స‌భ్యులు, బంధువులు నిరసనకు దిగారు. అవంతి వాహనం ఢీకొట్ట‌డం వ‌ల్లే సూర్యనారాయణ మృతి చెందాడని చెప్పారు. ప్రభుత్వం తరఫున త‌మ‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్ర‌స్తుతం మంత్రి అవంతి ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు.

దీంతో అవంతి శ్రీ‌నివాస్ మృతుడి బంధువుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. ఆ ఘోర‌ ప్ర‌మాదం జ‌రిగిన‌ స‌మ‌యంలో వాహ‌నంలో తాను లేనని ఆయ‌న చెప్పారు. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు. ప్ర‌మాద ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. తాము మాన‌వ‌తా దృక్ప‌థంతోనే ఆర్థిక సాయం అందిస్తామ‌ని చెబుతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. మృతుడి కుటుంబానికి రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని బంధువులు డిమాండ్ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/