‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ ప్యాకేజీ వివరాలు

Nirmala Sitharaman

న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మరోసారి ఆత్మ నిర్భర్‌ భారత్‌ ప్యాకేజీ వివరాలను  వివరిస్తున్నారు. ఈనేపథ్యలో ఆమె వలస కూలీలు, చిన్న రైతులు, స్ట్రీట్‌ వెండర్స్‌, ముద్ర యోజన్‌ హౌసింగ్‌, గిరిజనులకు ఉద్యోగ కల్పన తదితర అంశాలపై ప్యాకేజీ వివరాలు వివరిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని పేదలు, నిరాశ్రయులు, వలస కార్మికులకు కూడా ప్యాకేజిలో పెద్దపీట వేశారని, వారి సంక్షేమం కోసం భారీగా కేటాయించారని తెలిపారు. వారి సహాయ శిబిరాలు, భోజన ఏర్పాట్ల కోసమే రూ.11,000 కోట్లు కేటాయించారని, నిత్యం మూడు పూటలా భోజనం అందించే ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. వలస కార్మికులకు ఇప్పటికే నగదు పంపిణీ చేయడం కూడా జరిగిందని ఆమె వివరించారు.

తగ్గింపు రేట్లతో 3 కోట్ల మంది రైతులకు ఇప్పటికే రూ.4 లక్షల కోట్లు రుణాల రూపంలో అందజేశామని వెల్లడించారు. సన్నకారు రైతులకు తక్కువ వడ్డీ రేటుకే రుణాలు ఇస్తున్నామని, కిసాన్ కార్డుదారులకు రూ.25 వేల కోట్ల రుణాలు తమ ప్రభుత్వ ఘనత అని నిర్మల పేర్కొన్నారు. గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులకు ప్రభుత్వం మార్చిలో రూ.29,500 కోట్లు రీఫైనాన్స్ చేసిందని అన్నారు. ఈ రెండో ప్యాకేజి ముద్ర యోజన, గృహ కల్పన, ఉద్యోగ కల్పన రంగాలకు కూడా చేయూతనిస్తుందని తెలిపారు. అంతేకాకుండా, సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు మే 31 వరకు రాయితీ పొడిగిస్తున్నట్టు చెప్పారు. గిరిజనులకు ఉపాధి కల్పించే అవకాశాలపైనా కేంద్రం ప్రత్యేకం దృష్టి సారించిందని తెలిపారు. పట్టణ స్వయం సహాయక సంఘాలకు ఇప్పటికే రూ.12 వేల కోట్లు అందించామని, పైసా పోర్టల్ ద్వారా స్వయం సహాయక సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చామని అన్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/