విశాఖ నార్త్ నుంచి ల‌క్ష్మీనారాయ‌ణ పోటీ

త్వరలో జరగబోయే ఎన్నికల్లో తాను పోటీ చేసే స్థానంపై సీబీఐ మాజీ జేడీ, జై భారత్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ప్రకటన చేశారు. విశాఖ ఉత్తరం సీటు నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయం కోసమే యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ వల్ల స్థానిక స్వపరిపాలన పోయిందని విమర్శించారు. చట్టాల రూపకల్పనలో ప్రజల అభిప్రాయం తీసుకోవడం లేదని అన్నారు.

గతంలో జనసేన పార్టీ తరఫున తాను విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశానని, ప్రస్తుతం తమ పార్టీ నిర్ణయం మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని అన్నారు. ఫ్రంట్ తరఫున లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి జీఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేస్తారని, ఆల్ తెలుగు ప్రజా పార్టీ నాయకుడు డాక్టర్ కె శివ భాగ్య రావు బాపట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారని, ప్రబుద్ధ రిపబ్లిక్ అండ్ పార్టీ అధ్యక్షుడు దాసరి చెన్నకేశవులు కొండేపి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారని లక్ష్మీనారాయణ వివరించారు.