ఉత్తరప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం: ఆరుగురు సజీవదహనం

ఉత్తరప్రదేశ్‌లోని ఖుషినగర్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనమయ్యారు. రాంకోలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉర్దా బాపునగర్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఇంట్లోనుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు.

అప్పటికే మంటలు వేగంగా ఇంటి చుట్టూ వ్యాప్తిచెందడంతో ఇంట్లోని వారు బయటకు రాలేకపోయారు. ఫలితంగా మంటల్లోనే వారు సజీవదహనం అయ్యారు. మరణించిన వారిలో ఓ మహిళ, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. అర్థరాత్రి ఈ విషాద ఘటన చోటు చేసుకోవటంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. ఇంట్లో అగ్నిప్రమాదం ఎలాజరిగిందన్న కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.