రెండో దశ మెట్రో రైల్ విస్త‌ర‌ణ ప‌నుల శంకుస్థాప‌న ఏర్పాట్ల‌పై మంత్రి కేటీఆర్ సమీక్ష

మెట్రో రైలు సెకండ్ ఫేజ్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మైండ్‌స్పేస్ జంక్షన్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో కారిడార్‌ నిర్మించబోతున్నారు. డిసెంబరు 9వ తేదీన సీఎం కేసీఆర్‌ ఇందుకు భూమిపూజ చేయనున్నారు. 31 కిలోమీటర్ల మేర చేపట్టే ఈ సెకండ్ ఫేజ్ కోసం సుమారు రూ.6,250 కోట్ల ఖర్చు చేయనున్నారు. శంకుస్థాప‌న ఏర్పాట్ల‌పై మంత్రి కేటీఆర్ బుధువారం సమీక్ష జరిపారు.

ఈ స‌మీక్ష స‌మావేశానికి మంత్రులు మ‌హ‌ముద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, స‌బితా ఇంద్రారెడ్డి హాజ‌ర‌య్యారు. డిసెంబ‌ర్ 9వ తేదీన మెట్రో రైల్ రెండో ద‌శ ప‌నుల‌కు సంబంధించిన శంకుస్థాప‌న కార్య‌క్ర‌మంపై చ‌ర్చించారు. ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ బ‌లోపేతానికి మెట్రో కారిడార్ దోహ‌ద‌ప‌డుతుంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. శంకుస్థాప‌న ప్రాంతంలో రెండు రోజుల్లో ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. రేపు మంత్రులు క్షేత్ర స్థాయిలో స్థ‌ల ప‌రిశీల‌న చేయాల‌ని కేటీఆర్ సూచించారు.

హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఈ ఎయిర్ పోర్ట్ మెట్రో కారిడార్ ఉపయోగపడుతుందని చెప్పారు. శంషాబాద్ నుంచి మొదలుకొని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య ప్రయాణం చేసే లక్షలాదిమందికి ఈ మెట్రో రైలు విస్తరణ ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. ఇంతటి కీలకమైన కార్యక్రమం శంకుస్థాపనను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ అధికారులను ఆదేశించారు.

2017 నవంబర్ లో నాగోల్ – అమీర్పేట్ – మియాపూర్ మెట్రో మార్గం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. 2018 అక్టోబర్ లో ఎల్బీనగర్ – అమీర్పేట్ మెట్రో లైన్ను ప్రారంభించారు. 2019 మార్చిలో అమీర్పేట్ –హైటెక్ సిటీ మెట్రో లైన్ ను ప్రారంభించారు. జేబీఎస్ – ఎంజీబీఎస్ మెట్రో లైన్ 2020 ఫిబ్రవరి 7 నుంచి అందుబాటులోకి వచ్చింది.

మెట్రోలో కరోనా ముందు వరకు దాదాపు 5 లక్షల మంది ప్రయాణించగా.. ప్రస్తుతం సుమారు 4లక్షల వరకు ప్రయాణిస్తున్నారు. రానున్న రోజుల్లో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో విస్తరణ జరిగినట్లయితే ఇంకా ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.