తెలంగాణ భవన్‌లో ఘనంగా ఉగాది వేడుకలు

తెలంగాణ భవన్ లో ఉగాది వేడకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పాల్గొన్నారు. వేదపండితులు కేటీఆర్ కు వేదాశీర్వచనం అందించారు. అనంతరం పంచాంగం పఠనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ మాజీ స్పీకర్‌ మాజీ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు,ప్రజా ప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఇక ఈ ఏడాది కేసీఆర్ జాతకం ఎలా ఉందనేది పండితులు తెలిపారు. తెలంగాణ భవన్ పంచాంగ శ్రవణం ప్రకారం.. కేసీఆర్‌ రాశి (కర్కాటకం) అత్యంత సంతోషకరంగా ఆదాయ, వ్యయాలు కనిపిస్తున్నాయని పండితులు వివరించారు. అన్ని వ్యవహారాల్లో కేసీఆర్‌ విజయం సాధిస్తారట. వారి మాటకు, గమనానికి అడ్డులేని సంవత్సరంగా కనిపిస్తోందట. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కేసీఆర్‌ తీసుకోవాలని చెబుతున్నారు. వాహన ప్రమాద సూచన ఉంది కాబట్టి ఎక్కువ ప్రయాణాలు చేయొద్దట. ఇక కేసీఆర్ దోష నివారణ కోసం లక్ష్మీ మోహన గణపతిని చవితి నాడు దర్శనం చేసుకోవాలని పండితులు సూచించారు. తెలంగాణ రాష్ట్ర పాలక పక్షంకు ఈ సారి కష్టకాలం ఉందని.. ప్రతి పక్షానికి దిగ్విజయం ఉందని తెలిపారు పండితులు.