బిఆర్ఎస్లోకి వస్తే పొన్నాలకు ప్రాధాన్యత ఇస్తాం: కెటిఆర్
బిఆర్ఎస్ లో చేరేందుకు పొన్నాల సానుకూలంగా స్పందించారని వెల్లడి
హైదరాబాద్: సిఎం కెసిఆర్ సూచన మేరకు పొన్నాల లక్ష్మయ్యను బిఆర్ఎస్లోకి ఆహ్వానించినట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు. పొన్నాలతో భేటీ అనంతరం కెటిఆర్ మాట్లాడుతూ.. ‘పొన్నాలకు పార్టీలో తగిన గౌరవం, ప్రాధాన్యత కల్పిస్తాం. ఆదివారం సీఎం కెసిఆర్ను కలిసి.. జనగామలో జరిగే బహిరంగ సభలో పార్టీలో చేరాలని కోరగా సుముఖత వ్యక్తం చేశారు. సీఎంతో మాట్లాడిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తామని పొన్నాల చెప్పారు. బలహీనవర్గాలకు చెందిన అనేక మంది నాయకులకు సీఎం కెసిఆర్ బిఆర్ఎస్లో ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే పొన్నాలకూ ప్రాధాన్యత కల్పిస్తాం’’ కెటిఆర్ వెల్లడించారు.
కాగా, జనగామలో జరిగే బిఆర్ఎస్ సభ ద్వారా పార్టీలో చేరాలని పొన్నాలను కోరామని, అయితే ఆయన సిఎం కెసిఆర్ తో మాట్లాడిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారని, మొత్తానికి పార్టీలో చేరేందుకు పొన్నాల సానుకూలంగానే స్పందించారని కెటిఆర్ వివరించారు. పొన్నాల సిఎం కెసిఆర్ ను ఆదివారం నాడు కలుస్తారని వెల్లడించారు. బలహీన వర్గాల నేతలకు సముచిత గుర్తింపు ఇచ్చిన ఘనత కెసిఆర్ సొంతమని కెటిఆర్ పేర్కొన్నారు.
పొన్నాల నిన్న రాజీనామా చేయగా… బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ నేడు పొన్నాల నివాసానికి వెళ్లారు. పొన్నాలతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ భేటీ ముగిసిన అనంతరం కెటిఆర్ మీడియాతో మాట్లాడారు.