రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ సీరియస్..కాంగ్రెస్‌ దిష్టిబొమ్మల దహనానికి పిలుపు

minister-ktr

వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్‌ సరఫరాపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అనుచిత వ్యాఖ్యలఫై బిఆర్ఎస్ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తాము అధికారంలోకి వస్తే 8 గంటలు మాత్రమే కరెంట్‌ ఇస్తామని రేవంత్‌ రెడ్డి ప్రకటన చేయడం ఫై కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా ఈరోజు, రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు బీఆర్‌ఎస్‌ పార్టీ పిలుపునిచ్చింది. ప్రతి గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ దిష్టి బొమ్మలు దహనం చేయాలని కేటీఆర్ సూచించారు.

ఉచిత విద్యుత్‌ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్‌ పార్టీది అని కేటీఆర్‌ అన్నారు. విద్యుత్‌ ఇవ్వకుండా గతంలో రైతులను గోసపెట్టిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీది అని గుర్తు చేశారు. ఇప్పుడు మరోసారి తన రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్‌ పార్టీ బయటపెట్టుకుందని అన్నారు. కాంగ్రెస్‌ నిర్ణయాన్ని తెలంగాణ రైతాంగం, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు.

తాము అధికారంలోకి వస్తే 8 గంటలు మాత్రమే కరెంట్‌ ఇస్తామని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఒక ఎకరానికి నీళ్లు పట్టాలంటే ఒక గంట సరిపోతుంది.. అలాంటప్పుడు నిరంతరాయ విద్యుత్‌ ఎందుకు అన్నట్లుగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయానికి నిరంతరాయ కరెంట్‌, రైతుబంధు పథకాలను కొనసాగిస్తారా? లేదా? అని అమెరికాలో ఎన్‌ఆర్‌ఐలు అడిగిన ప్రశ్నలకు ఈ మేరకు తన మనసులోని మాటను రేవంత్‌ రెడ్డి బయటపెట్టారు.