శ్రీశైలం జలాశయం మూడు గేట్లు ఎత్తివేత

శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా చేరుతుండడం తో శనివారం ఉదయం మూడు గేట్లు ఎత్తివేసి నీటిని కిందకు వదిలారు. ఏపీ జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు ప్రత్యేక పూజలు చేసి మూడు గేట్లను ఎత్తారు. ప్రాజెక్టులో గరిష్ట నీటి నిల్వ 215.81 టీఎంసీలకు గాను ప్రస్తుతం 202.04 టీఎంసీలు ఉంది.ఇన్‌ఫ్లో 1,27, 980 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ ఫ్లో 74,365 క్యూసెక్కులు ఉంది. కుడి, ఎడమ గట్ల విద్యుత్‌ కేంద్రాల్లో కరెంట్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్టులో 882 అడుగుల్లో స్థిరంగా నీటిని నిల్వ చేస్తూ.. మిగులుగా ఉన్న నీటిని స్పిల్‌ వే గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మూడు గేట్ల ద్వారా నాగార్జున సాగర్‌ వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. భారీ వరదలు వస్తే, మరిన్ని గేట్లు ఎత్తేందుకు రంగం చేసింది ఏపీ సర్కార్‌. కాగా.. వేలాది క్యూసెక్కుల వరద నీరు చేరుకుంటుండటంతో… శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. గతవారం కురిసిన భారీ వర్షాల నుండి ప్రజలు ఇంకా తేరుకోకముందే మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో మరోసారి భద్రాచలం వద్ద గోదావరి వరద ఉదృతి పెరిగింది. నిన్న 42 అడుగులమేర ప్రవహించిన గోదావరి ఈరోజు 45 అడుగులు దాటింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.