మంత్రి పార్థా ఛ‌ట‌ర్జీ అరెస్ట్

ప‌శ్చిమ బెంగాల్ మంత్రి పార్థా ఛ‌ట‌ర్జీని అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. పశ్చిమ బెంగాల్‌ టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌లో పార్థా ఛ‌ట‌ర్జీకి సంబంధం ఉందని ఆరోపణలు రావడంతో ఆయన్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కోల్‌కతాలోని నివాసంలో సుమారు 26 గంటలకు పైగా ఆయన్ని ప్రశ్నించిన ఈడీ.. చివరకు ఈ ఉదయం అదుపులోకి తీసుకుంది. ఇదిలా ఉంటే.. శుక్రవారం అంతా విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి పరేష్‌ అధికారే, ఎమ్మెల్యే మాణిక్‌ భట్టాచార్య.. తదితరుల ఇళ్లలో ఈడీ దాడులు కొనసాగాయి. అదే సమయంలో పార్థాతో దగ్గరి సంబంధాలున్న అర్పిత ముఖర్జీ ఇంట్లో సైతం తనిఖీలు చేపట్టి.. సుమారు రూ. 20 కోట్ల విలువైన నగదును స్వాధీనం చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.

నిన్న రాత్రంతా పార్ధా ఛ‌ట‌ర్జీని విచారించామ‌ని, అత‌న్ని ఈడీ ఆఫీసుకు తీసుకువ‌చ్చిన‌ట్లు ఓ అధికారి తెలిపారు. ప్ర‌స్తుతం పార్థా ఛ‌ట‌ర్జీ బెంగాల్ ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్నారు. గ‌తంలో ఆయ‌న విద్యాశాఖ మంత్రిగా చేశారు. అయితే ఆయ‌న విద్యాశాఖ మంంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఉపాధ్యాయ పోస్టుల భ‌ర్తీలో కుంభ‌కోణం జ‌రిగినట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈడీ దాడులను బీజేపీ చేపట్టిన కుట్రపూరిత చర్యగా టీఎంసీ ఆరోపించింది. అయితే దీనికి బీజేపీ గట్టి కౌంటరే ఇచ్చింది. అసలు సినిమా ముందు ముందు ఉందంటూ ప్రతిపక్ష నేత సువెందు అధికారి ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు.