ఇంద్రవెల్లి సభలో రేవంత్ చేసిన ప్రకటన ఫై కేటీఆర్ కౌంటర్

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి వేదికపై ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..తాము 7వేల మంది స్టాఫ్ నర్సులకు ఉద్యోగాలు ఇచ్చామని, మరో 15 రోజుల్లో 15వేల మంది కానిస్టేబుళ్లను నియమించుకుంటామని ప్రకటించారు. ఈ ప్రకటన ఫై కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. స్టాఫ్ నర్స్, 15వేలకు పైగా కానిస్టేబుల్ ఉద్యోగాల రిక్రూట్మెంట్ కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేసిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

క్రెడిట్ చోరీ కాంగ్రెస్ పార్టీకి ఇది మొదటిసారి కాదు, చివరిసారి కూడా కాదు… 6,956 స్టాఫ్ నర్సులు, 15,750 పోలీస్ కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్‌ను కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేసిందని ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఎన్నికల కోడ్ కారణంగా ఫలితాలను విడుదల చేయలేకపోయామని తెలిపారు. ఇప్పుడు రిక్రూట్‌మెంట్‌తో సంబంధం లేని కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని తామే చేశామని ప్రజలను మోసం చేయాలనుకుంటోందని విమర్శించారు. నూతన ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటు అన్నారు.

15,750 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి కేసీఆర్ హయాంలోనే రిక్రూట్మెంట్ జరిగిందని చెబుతూ టైమ్స్ ఆఫ్ ఇండియా 5 అక్టోబర్ 2023 రోజున ఇచ్చిన వార్తను ట్వీట్‌కు జతపరిచారు. అంతేకాదు, 7 అగస్ట్ 2023 రోజున నర్సుల రిక్రూట్మెంట్‌కు సంబంధించిన జీవోను కూడా జత చేశారు.