బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే ఏపీలో అదే రిపీట్ అవుతుంది – కొడాలి నాని

వైసీపీ నేత , గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై విరుచుకపడ్డారు. రీసెంట్ గా తెలంగాణ ఎన్నికల్లో జనసేన ..బిజెపి తో కలిసి పోటీ చేసింది. మొత్తం 8 స్థానాల్లో పోటీ చేస్తే..కనీసం డిపాజిట్ కూడా రాలేదు. ఇప్పుడు ఇదే వైసీపీ నేతలకు అస్త్రం గా మారింది. తెలంగాణ లో ఎలాగైతే ఫలితాలు వచ్చాయో..ఏపీలో కూడా అదే రిపీట్ కాబోతున్నాయని తాజాగా కొడాలి నాని అన్నారు. టీడీపీ ఏపీలో అధికారంలోకి రావడానికి జనసేనతో కలవలేదని, ప్రతిపక్షంలో కూర్చునేందుకు కలిశారని ఎద్దేవా చేశారు.

అదే సమయంలో తాను ఎమ్మెల్యే కావాలనుకుంటే టీడీపీతో కలవాల్సిందేనని జనసేనాని అనుకుంటున్నారని చురకలు అంటించారు. ఎమ్మెల్యేగా గెలిచేందుకు పవన్ కల్యాణ్, ప్రతిపక్షం కోసం చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారన్నారు. వీరిద్దరు కలిసి జగన్ వెంట్రుక కూడా పీకలేరన్నారు. జగన్ సింహం మాదిరి సింగిల్‌గా వస్తారన్నారు. జగన్ మీద ఏపీలో ఎలాంటి వ్యతిరేకత లేదని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతే టీడీపీ వాళ్లు ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారని, గెలిస్తే తమ వారు అని, ఓడితే కాదని అనడం వారికి అలవాటే అని ఎద్దేవా చేశారు.