పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటన ఫై కొడాలి నాని సెటైర్లు

మాజీ మంత్రి , గుడివాడ వైస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి తన నోటికి పనిచెప్పారు. జనసేన అధినేత , టీడీపీ అధినేతల ఫై సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద రెక్కీ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకరేపిన సంగతి తెలిసిందే. చివరకు ఆ అలాంటిదేమి లేదని తాగిన మైకంలో ముగ్గురు యువకులు పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద గొడవ చేసారని , వారిని అదుపులోకి తీసుకున్నామని తెలంగాణ పోలీసులు తేల్చి చెప్పారు. అలాగే శుక్రవారం రాత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నందిగామ పర్యటనలో రాయి విసరడం పెద్ద దుమారమే రేపుతోంది. ఈ రెండు సంఘటనలపై కొడాలి నాని స్పందించారు.

చంద్రబాబు, పవన్ లు రాష్ట్రంలో లేని కొత్త సమస్యలను సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు, పవన్ లు పొలిటికల్ టూరిస్టులు అని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా పవన్ ఇంటి వద్ద రెక్కీ జరిగిన ఘటనను ప్రస్తావించిన నాని… తాగుబోతులు గొడవ చేస్తే పవన్ ఇంటిపై రెక్కీ జరిగందంటూ జనసేన ఆరోపిస్తోందని ఆయన సెటైర్లు సంధించారు.

చంద్రబాబు రోడ్ షోపై జరిగిన దాడిని ప్రస్తావించిన నాని… గులకరాయితో చంద్రబాబుపై హత్యాయత్నం జరిగిందట అని వ్యంగ్యం ప్రదర్శించారు. చంద్రబాబు తనపై తానే గులకరాయి వేయించుకున్నారని కూడా ఆయన ఆరోపించారు. టీడీపీ, జనసేనలు డ్రామాలు చేస్తున్నాయన్నారు. కేఏ పాల్ కన్నా వెనకబడిపోయానని పవన్ ఇప్పటం గ్రామానికి వచ్చారన్నారు. అంతేకాకుండా కేఏ పాల్ ను మించి హడావిడి చేసేందుకు ఇప్పటంలో పవన్ ప్రయత్నించారన్నారు. విపక్షాలు ఇప్పటిదాకా ఒక్క నిర్మాణాత్మకమైన సలహా అయినా ఇచ్చాయా? అని ఆయన ప్రశ్నించారు.