ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కిషన్ రెడ్డి

అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశం కానున్న కిషన్ రెడ్డి

union-minister-kishan-reddy

హైదరాబాద్‌ః హైకమాండ్ నుంచి అత్యవసర కాల్ రావడంతో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర కేబినెట్ సమావేశంలో రాష్ట్ర అంశాలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. గిరిజన విశ్వవిద్యాలయం, పసుపు బోర్డు వంటి పలు కీలక అంశాలపై కేబినెట్ లో నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందని చెపుతున్నారు. మరోవైపు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కిషన్ రెడ్డి భేటీ కానున్నారు. అసెంబ్లీ ఎన్నికలపై వీరిద్దరూ లోతుగా చర్చలు జరపనున్నారు.

ఇదిలావుంచితే, నిన్న ఇందూరు సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ పై ప్రధాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టించాయి. కెసిఆర్ ఢిల్లీకి వచ్చి తనను కలిశారని, ఎన్టీయేలో చేరుతామని, కెటిఆర్ కు రాష్ట్రంలో పాలన పగ్గాలు అందించాలనుకుంటున్నానని, కెటిఆర్ ను ఆశీర్వదించాలని తనను కెసిఆర్ కోరారని మోడీ చెప్పారు. అయితే ఇది రాచరికం కాదని, బిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోబోమని ఆరోజే కెసిఆర్ కు స్పష్టం చేశామని తెలిపారు. ఎన్టీయేలో బిఆర్ఎస్ చేరేందుకు తాను అంగీకరించలేదని చెప్పారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.