తమను అణుదాడితో రెచ్చగొడితే ..అణుబాంబు తప్పదుః ఉత్తరకొరియా అధినేత వార్నింగ్

ఖండాంతర క్షిపణి ప్రయోగం మాక్ డ్రిల్‌కు హాజరైన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్

Kim Jong Un Warns Of Nuclear Attack If Enemy Provokes With Nukes

ప్యోంగ్యాంగ్ః ఉత్తరకొరియాను అణుదాడితో రెచ్చగొడితే తాము అణుబాంబు ప్రయోగానికి వెనకాడబోమని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తాజాగా హెచ్చరించారు. గురువారం మిసైల్ బ్యూరో ఆధ్వర్యంలో ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ క్షిపణి ప్రయోగం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కిమ్..డ్రిల్‌కు హాజరైన సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన అణుదాడి హెచ్చరికలు చేసినట్టు ఉత్తరకొరియా వార్తా సంస్థ కేసీఎన్ఏ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రత్యర్థి అణుబాంబులతో రెచ్చగొడితే సంకోచించకుండా అణు బాంబు ప్రయోగించాలని మిసైల్ బ్యూరోకు కిమ్ సూచించినట్టు కేసీఎన్ఏ పేర్కొంది. చర్చల్లో బేషరతుగా పాల్గొనాలంటూ దక్షిణ కొరియా, దాని మిత్రదేశాలు కిమ్‌ను కోరిన నేపథ్యంలో ఈ హెచ్చరికలకు ప్రాధాన్యం ఏర్పాడింది.

గతవారం వాషింగ్టన్ డీసీలో అమెరికా, దక్షిణకొరియా మధ్య కీలక సమావేశం జరిగింది. ఉత్తరకొరియాతో యుద్ధం తలెత్తిన పక్షంలో అణుబాంబు ప్రయోగ నివారణకు ఏం చేయాలనే దానిపై ఈ మీటింగ్‌లో చర్చ జరిగింది. కాగా, ఉత్తరకొరియా తమపై అణుబాంబు ప్రయోగిస్తే కిమ్ పాలన అంతమైపోతుందంటూ ఉభయ దేశాలూ సమావేశం అనంతరం ఘాటు వ్యాఖ్యలు చేశాయి. ఎటువంటి ముందస్తు షరతులు లేకుండా శాంతి చర్చల్లో కిమ్ పాల్గొనాలని కిమ్‌కు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా అధ్యక్షుడి హెచ్చరికలకు ప్రాధాన్యం ఏర్పడింది.