అధికారులపై కిమ్ జాంగ్ చిందులు

కరోనా కట్టడిలో విఫలం.. అధికారులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్న కిమ్

ప్యోంగ్యాంగ్ : తమ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా లేదంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు నివేదిక ఇచ్చిన ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జాంగ్ ఉన్ ఇప్పుడు కరోనాను కట్టడి చేయడంలో విఫలమయ్యారంటూ ఉన్నతాధికారులను తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారు. ఈ మేరకు స్థానిక మీడియా పేర్కొంది. కరోనాను కట్టడి చేయడంలో విఫలం కావడంతో దేశంలో పరిస్థితులు దయనీయంగా తయారవుతున్నాయని కిమ్ ఆవేదన వ్యక్తం చేసినట్టు అధికారిక మీడియా కేసీఎన్ఏ కూడా పేర్కొనడం గమనార్హం.

అంతేకాదు, కరోనా కట్టడిలో విఫలమైన కొందరు అధికారులను కిమ్ విధుల నుంచి తొలగించినట్టు మీడియా తెలిపింది. కరోనా కట్టడికి కఠిన చర్యలు చేపట్టిన ఉత్తర కొరియా తమ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన చైనాతో ఉన్న సరిహద్దులను కూడా మూసేసింది. ఫలితంగా ఆహార సంక్షోభంతో విలవిల్లాడుతోంది. మరోవైపు, తమ దేశంలో కరోనా లేదంటూ కిమ్ ఇచ్చిన నివేదికపై అమెరికా, జపాన్‌లు ఇప్పటికే అనుమానాలు వ్యక్తం చేశాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/