విడాకుల విషయంపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

వైవాహిక బంధం స‌రిగా లేకున్నా.. విడాకులు ఇవ్వ‌క‌పోవ‌డం క్రూర‌త్వ‌మే..కేర‌ళ హైకోర్టు

Key comments of Kerala High Court on Divorce

తిరువనంతపురంః విడాకుల విషయంలో కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దంపతుల మ‌ధ్య వైవాహిక బంధం పూర్తిగా ధ్వంస‌మైనా విడాకులు ఇవ్వ‌కుండా భాగ‌స్వామి అడ్డుకోవ‌డం క్రూర‌త్వ‌మే అవుతుంద‌ని వ్యాఖ్యానించింది. జ‌స్టిస్ ఏ మ‌హ‌మ్మ‌ద్ ముస్తాక్‌, జ‌స్టిస్ సోఫీ థామ‌స్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ తీర్పును ఇచ్చింది. భార్యాభ‌ర్త‌లు త‌రుచూ గొడ‌వ‌ప‌డ‌డం, మ‌ర్యాద ఇచ్చుకోక‌పోవ‌డం వంటి ఘటనల వల్ల ఆ జంట కలిసి ఉండలేదని.. అలాంటి సమయంలో విడిపోవడమే ఉత్తమమని పేర్కొంది. ఒకవేళ జంటలో ఒకరు విడాకులకు అప్లై చేస్తే మరొకరు అడ్డుకోవడం క్రూరత్వమే అవుతుందని వెల్లడించింది.

త్రిసూరుకు చెందిన ఓ వ్యక్తి వేసిన కేసులో కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. 2002లో పెళ్లి చేసుకున్న వ్య‌క్తి.. త‌న‌కు భార్య నుంచి విడాకులు ఇప్పించాల‌ని గ‌తంలో కోర్టును ఆశ్ర‌యించారు. తన భార్యకు వేరే వ్యక్తితో అపైర్ ఉందని.. కేవలం తన డబ్బును మాత్రమే కోరుకుంటుందని.. తనతో ప్రేమగా నడుచుకోవడం లేదని ఫిర్యాదులో ఆరోపించాడు. ఈ కేసులో పిటిష‌న‌ర్‌కు విడాకులు మంజూరీ చేస్తూ తీర్పును ఇచ్చింది. భార్య‌కు ప‌ది ల‌క్ష‌ల‌తో పాటు 10 సెంట్ల స్థ‌లాన్ని ఇవ్వాల‌ని కోర్టు ఆదేశించింది.