బన్నీ వాసు కు పెను ప్రమాదం తప్పింది
నిర్మాత బన్నీ వాసు పెను ప్రమాదం నుండి క్షేమంగా బయటపడ్డారు. గత కొద్దీ రోజులుగా పడుతున్న వర్షాల కారణంగా గోదావరి నది ఉప్పొంగిప్రవహిస్తుంది. దీంతో గోదావరి పరీవాహక ప్రాంతాలు నీటమునిగాయి. ముఖ్యంగా లంకప్రాంతాలు గత వారం రోజులుగా నీటిలోనే ఉన్నాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో బన్నీ వాసు తో పాటు జనసేన కార్య కర్తలు వారికీ నిత్యావసరాలు అందజేస్తున్నారు. కాగా వరదలలో చిక్కుకున్న ఓ గర్భిణీని రక్షించారు. ఆ సమయంలో ఆయన ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైంది. బాడవ గ్రామంలో వరదలో చిక్కుకున్న వారిని పడవలో ఏనుగువారి లంక తీసుకు వస్తుండగా వరద ఉధృతి పెరిగింది.
దీంతో పడవ నీటిలో కొట్టుకోపోసాగింది. ఆ క్రమంలో పడవ కొబ్బరి చెట్టుకు తగిలి ఆగింది. దీంతో పడవలోని వారంతా కంగారు పడటంతో పడవ విరిగి పోయింది. వెంటనే పడవ నడిపే వ్యక్తులు పడవలోని వారిని రక్షించారు. బన్నీవాసు, జనసేన నాయకులు, పడవలోని వారంతా ఊపిరి పీల్చుకున్నారు. అదృష్టం బాగుండి ప్రమాదం తప్పిందని బన్నీ వాసు చెప్పుకొచ్చారు.