నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న సిఎం కెసిఆర్
![](https://www.vaartha.com/wp-content/uploads/2023/08/CM-KCR-will-visit-Maharashtra-today-jpg.webp)
ఖమ్మం : సిఎం కెసిఆర్ ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్తుపల్లి, ఇల్లెందు నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కల్లూరులో, 2 గంటలకు ఇల్లెందు మండలం బొజ్జాయిగూడెంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ఈ నెల 27న ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో తొలి ఎన్నికల ప్రచార సభ విజయవంతం కావడంతో శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ఇదే జోష్తో సత్తుపల్లి సభకు భారీ జనసమీకరణపై అక్కడి ఎమ్మెల్యే, బిఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య దృష్టి సారించారు. సుమారు లక్ష మంది ప్రజలు హాజరయ్యేలా విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ఏర్పాట్లను మంగళవారం రాజ్యసభ సభ్యుడు, సత్తుపల్లి నియోజకవర్గ బిఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి బండి పార్థసారథిరెడ్డి, సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు పరిశీలించారు. సీఎం సభకు పోలీసు యంత్రాగం కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్లో హెలీకాప్టర్లో బయలుదేరే సిఎం కెసిఆర్.. నేరుగా కల్లూరుకు చేరుకుంటారు. అనంరతం అక్కడి సభలో నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.