కేసీఆర్ తుంటి ఆపరేషన్ సక్సెస్

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మొన్న రాత్రి బాత్రూం లో కిందపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో అయన తుంటి ఎముక రెండుచోట్ల విరగడంతో యశోద ఆసుపత్రి వైద్య బృందం…విజయవంతంగా తుంటి ఎముక మార్పిడి చేసారు. అనంతరం కేసీఆర్ ను ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూకి తరలించారు. పార్టీ అధినేతకు సర్జరీ సక్సెస్ అయిందని తెలియగానే బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేసారు. కేసీఆర్ సతీమణి శోభ కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత, హరీష్ రావు, సంతోష్ తదితరులు యశోద హాస్పిటల్ లో ఉండి కేసీఆర్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌ విడిచిపెట్టి నేరుగా ఫామ్‌హౌస్‌ చేరుకున్నారు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రజలు, పార్టీ నాయకులు ఆయనతో సమావేశమవుతున్నారు. త్వరలోనే మంచిరోజులు వస్తాయని వారికి భరోసా ఇస్తున్నారు. గురువారం నాడు ఎర్రవల్లి లోని కేసీఆర్ నివాసం జన సందోహంతో నిండిపోయింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నేతలు, మేధావులు, కవులు, కళాకారులు, మహిళలు, యువకులు కేసీఆర్ ను కలిసినవారిలో ఉన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారు తమ అభిమాన నేతను కలిసి కరచాలనం చేసి భుజం మీద చేతులు వేయించుకుని మరీ ఫోటోలు దిగారు.