బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూశారు. ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో నందిత అక్కడికక్కడే మృతిచెందారు. పటాన్‌చెరూ సమీపంలో ఓఆర్‌ఆర్‌పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఘటనా స్థలంలోనే మరణించారు. కారు డ్రైవర్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే సాయన్న మరణంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన కూతురు లాస్య నందితకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కంటోన్మెంట్‌ సీటు ఇచ్చారు. బీజేపీ అభ్యర్థిపై ఆమె సాధించిన విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా నల్లగొండలో జరిగిన బీఆర్‌ఎస్‌ బహిరంగసభకు హాజరై తిరిగి వస్తుండగా నార్కట్‌పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ..ఇపుడు మరో రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు.

నందిత..1987లో హైదరాబాద్‌లో జన్మించిన..ఈమె కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ పూర్తిచేశారు. అనంతరం 2015లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, అదేఏడాది జరిగిన కంటోన్మెంట్‌ బోర్డు ఎన్నికల్లో ఓడిపోయింది. 2016లో తన తండ్రి, అప్పటి ఎమ్మెల్యే సాయన్నతోపాటు బీఆర్‌ఎస్‌లో చేరారు. 2016-20 మధ్య కవాడిగూడ కార్పొరేటర్‌గా పనిచేశారు. 2021లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ నుంచి పోటీచేసి ఓటమి చవిచూశారు. తండ్రి మరణంతో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్‌ నుంచి పోటీచేసి విజయం సాధించింది. ఈమె మరణం పట్ల బిఆర్ఎస్ శ్రేణులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.