రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జవాన్లకు సీఎం కేసీఆర్ సంతాపం

ఉత్తర సిక్కింలో జెమా వద్ద ఆర్మీ ట్రక్కు లోయలోకి జారిపడిన ఘటన లో 16 మంది జవాన్లు మరణించారు. వీరి మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేసారు. జవాన్లు ప్రయాణిస్తున్న ఓ వాహనం ప్రమాదకర మలుపు వద్ద అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 16 మంది జవాన్లు మృతిచెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరణించిన వారిలో ముగ్గురు జూనియర్‌ కమిషన్డ్‌ అధికారులు ఉన్నారు.

జవాన్ల మృతి ఫై సీఎం కేసీఆర్ స్పందించారు. ఆర్మీ జవాన్లు, అధికారుల కుటుంబాలకు తన సానుభూతిని తెలిపారు. మృతి చెందిన జవాన్ల కుటుంబాలను ఆదుకోవాలని, క్షతగాత్రులకు తగువిధంగా వైద్యసేవలందించాలని సీఎం కేంద్రాన్ని కోరారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో మొత్తం 20 మంది జవాన్లు ఉన్నారు. వందల అడుగుల ఎత్తు నుంచి లోయలో పడటంతో వాహనం పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకొన్న రెస్క్యూ సిబ్బంది, ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. జవాన్లకు చెందిన మూడు వాహనాల కాన్వాయ్‌ చట్టేన్‌ నుంచి థంగు ప్రాంతానికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకొన్నదని ఆర్మీ ఓ ప్రకటనలో పేర్కొన్నది.