నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్‌ బస్సు యాత్ర

KCR bus yatra across the state from today

హైదరాబాద్‌ః బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు ప్రచార వేగాన్ని పెంచనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి ప్రజల కష్టాలు తెలుసుకోనున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని ఓటర్లను కోరనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ యాత్ర కొనసాగించబోయే బస్సుకు తెలంగాణ భవన్‌లో మంగళవారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈరోజు వరుసగా 17 రోజుల పాటు సాగే ఈ యాత్రకు ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇవ్వడంతో పార్టీ అవసరమైన ఏర్పాట్లను చేసింది. మే నెల 10వ తేదీ వరకు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. మిర్యాలగూడలో ప్రారంభమై సిద్దిపేటలో జరిగే బహిరంగసభతో యాత్ర ముగుస్తుంది. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కేసీఆర్‌ బస్సు యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. దాదాపు ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్‌షోలు ఉండే విధంగా బస్సు యాత్రను ప్లాన్‌ చేశారు.