కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమైందిః జేపీ నడ్డా

ఈ పదేళ్లలో కెసిఆర్ కుటుంబమే అభివృద్ధి చెందిందని మండిపాటు

JP Nadda participated in Sakala Janula Sankalpa Sabha held in Nizamabad

హైదరాబాద్‌ః తెలంగాణ ఉద్యమకారులను ముఖ్యమంత్రి కెసిఆర్ మోసం చేశారని బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. గురువారం ఆయన నిజామాబాద్‌లో నిర్వహించిన సకల జనుల సంకల్ప సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని గెలిపిస్తే తెలంగాణ రూపురేఖలు మారిపోతాయన్నారు. కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమైందని ఆరోపించారు. ఈ పదేళ్లలో ఆయన కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందిందని విమర్శించారు. దళితబంధులో ప్రజాప్రతినిధులు 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారన్నారు.

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తెలంగాణలో అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. నరేంద్ర మోడీ హయాంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఐదో స్థానానికి ఎగబాకిందన్నారు. గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా 80 కోట్లమందికి ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్నామన్నారు. కుటుంబ పాలన నుంచి పలు రాష్ట్రాలకు విముక్తి కల్పించామన్నారు. అదే మాదిరి ఇక్కడ కూడా కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు.