భట్టి విక్రమార్కకు లేఖ రాసిన కవిత

kavitha-writes-letter-to-mallu-bhatti-vikramarka

హైదరాబాద్‌ః బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు సోమవారం లేఖ రాశారు. బడ్జెట్‌లో బీసీ సంక్షేమానికి రూ.20వేల కోట్లు కేటాయించాలని కోరారు. బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ చేర్చిందని గుర్తు చేశారు. అలాగే బీసీ సంక్షేమానికి రానున్న అయిదేళ్లలో లక్ష కోట్ల రూపాయలు కేటాయిస్తామని హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. ఎంబీసీల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని కూడా కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందన్నారు.

అలాగే, ప్రతి జిల్లా కేంద్రంలో రూ.50 కోట్ల వ్యయంతో ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలను నిర్మిస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసిందన్నారు. బీసీల సంక్షేమం కోసం రాబోవు ఆర్థిక సంవత్సరానికిగానూ బడ్జెట్‌లో 20 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని కోరారు. ఈ మేరకు నిధులు కేటాయిస్తే కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేర్చినట్లు అవుతుందన్నారు. బీసీల అభివృద్ధికి ఈ నిధులు దోహదపడతాయన్నారు. బీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పని చేయాలన్నారు. అందుకు బీసీలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.