తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న కార్తికేయ 2 నిర్మాత



కార్తికేయ 2 తో మంచి లాభాలు అందుకున్న నిర్మాత అభిషేక్ అగర్వాల్..తాజాగా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. కరోనా సమయంలో పేదలకు సాయం చేసి వార్తల్లో నిలిచిన అభిషేక్.. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నారు. తిమ్మాపూర్ గ్రామం కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి జన్మస్థలం విశేషం.

అభిషేక్ అగర్వాల్, మంత్రి కిషన్ రెడ్డి మధ్య మంచి అనుబంధం ఉంది. పలు వేడుకలు, ఫంక్షన్లలో చాలాసార్లు వీరు కలిసి కనిపించారు. ఇక అభిషేక్ అగర్వాల్, ఆయన కుటుంబం చంద్రకళ ఫౌండేషన్ స్థాపించి ప్రజలకు సేవ చేస్తున్నారు. తన తండ్రి తేజ్ నారాయణ్ అగర్వాల్ 60వ పుట్టినరోజు, దివంగత అమ్మమ్మ శ్రీమతి చంద్రకళ 90వ జయంతి సందర్భంగా తిమ్మాపూర్ గ్రామాన్ని అభిషేక్ అగర్వాల్ దత్తత తీసుకుంటున్నారు. చంద్రకళ ఫౌండేషన్ 3వ సార్థక్ దివాస్ అక్టోబర్ 30న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో జరగనుంది.

అభిషేక్ అగర్వాల్ సినిమాల విషయానికి వస్తే..‘బ్రహ్మోత్సవం’ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన అభిషేక్.. ‘కిర్రాక్ పార్టీ’, ‘గూఢచారి’, ‘సీత’ సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఆ తరవాత ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’తో నిర్మాతగా మారారు. ‘రాజ రాజ చోర’, ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘కార్తికేయ 2’ చిత్రాలను నిర్మించి మంచి విజయాలను అందుకొని భారీగా లాభాలు అందుకున్నారు.