కాణిపాకం వినాయకుడి మూలవిరాట్‌ ఫోటో బయటకు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు

కాణిపాకం ఆలయంలో భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. గర్భగుడిలోని వరసిద్ది వినాయకుడి మూలవిరాట్ విగ్రహం ఫోటో బయటకు రావడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ సనాతన ధర్మంలో కొన్ని పుణ్యక్షేత్రాల్లోని మూల విరాట్ విగ్రహాన్ని ఫోటోలు తీయడం నిషేధం.. దీనికి కారణం ఆలయ స్వచ్ఛతను కాపాడడంతో గుడిలోపలకు అడుగు పెట్టి దైవ దర్శనం మీద తప్ప, వేరేవాటిమీద ఆలోచనలు చేయకుండా ఉండడం వంటి కారణాలు ఉన్నాయని చెబుతారు. అందుకనే తిరుమల, కాణిపాకం , ఇంద్రకీలాద్రి, సింహాచలం ఇలా ఏ హిందూ పుణ్యక్షేత్రాల్లో మూలవిరాట్ విగ్రహాన్ని ఫోటో తీయడానికి అనుమతినివ్వరు. అలాంటిది కాణిపాకం వినాయకుడి మూలవిరాట్‌ ఫోటో బయటకు రావడం ఫై అంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏప్రిల్ 11వ తేదీ మంగళవారం వైస్సార్సీపీ నేత, PKM UDA చైర్మన్ నల్లబాల వెంకటరెడ్డి యాదవ్ దంపతులు కాణిపాకం ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలోని వినాయక స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అయితే ఈ సమయంలో వెంకటరెడ్డి యాదవ్ అనుచరులు గుడిలో మూలవిరాట్ విగ్రహం ఫోటోలు తీశారు. వినాయక స్వామి మూలవిరాట్ గా ఉన్న ఫోటోలను ప్రవీణ్ చిన్న అనే వ్యక్తి తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. స్వామి వారి మూలవిరాట్ ఫోటోలు బయటకు రావడంతో హిందూ సంఘాలు, భక్తులు ఆగ్రహిస్తున్నారు. గుడిలోకి సెల్ ఫోన్ ఎలా అనుమతిస్తారంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇది ఆలయాధికారులు సిబ్బంది పని తీరు.. సెక్యూరిటీ వైఫల్యం అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సోషల్ మీడియాలో వినాయకుడి విగ్రహ ఫోటోలను డిలీట్ చేశారు.