పవన్ కళ్యాణ్ కడప టూర్ ఫై మంత్రి కాకాణి కామెంట్స్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా పేరిట…ఏపీలో ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు జిల్లాలో రైతుకుటుంబాలకు ఆర్ధిక సాయం చేసిన పవన్ కళ్యాణ్..ఈ నెల 20 న కడప జిల్లాలో యాత్ర చేపట్టబోతున్నారు. కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గంలో కౌలు రైతుల కుటుంబాలకు ఆయన ఆర్థిక సాయం చేయబోతున్నారు. ఈమేరకు ఆయన పర్యటన ఖరారైంది. అయితే ఈ పర్యటనకు కౌంటర్ గా ఇప్పటినుంచే వైసీపీ నేతలు సెటైర్లు పేలుస్తున్నారు.

కౌలు రైతు భరోసా యాత్రల పేరుతో పవన్ కల్యాణ్ వ్యవసాయం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. పవన్ తోపాటు, లోకేష్ కి కూడా వ్యవసాయంపై పరిజ్ఞానం లేదన్నారు. నెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కాకాణి.. పవన్, లోకేష్ పై సెటైర్లు పేల్చారు. రాష్ట్రంలో పండే 10 పంటల్ని పవన్ కల్యాణ్, లోకేష్ కి చూపిస్తామని.. ఆ పది పంటల్లో కనీసం ఐదింటిని గుర్తు పట్టడం వారికి సాధ్యం కాదని మంత్రి కాకాణి ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్, లోకేష్ ముందు పంటల గురించి అవగాహన పెంచుకోవాలని, ఆ తర్వాతే వ్యసాయం గురించి మాట్లాడాలన్నారు. వ్యవసాయం గురించి మాట్లాడటాన్ని తానుతప్పుబట్టడం లేదని, కానీ విషయావగాహన లేకుండా విమర్శలు చేయడం సరికాదన్నారు.