పవన్ కు మంత్రి జోగి రమేశ్ కౌంటర్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వైస్సార్సీపీ మంత్రి జోగి రమేశ్ కౌంటర్ ఇచ్చారు. ఆదివారం పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లా గుంకలాంలో జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి వైస్సార్సీపీ ప్రభుత్వం ఫై నిప్పులు చెరిగారు. జగనన్న ఇళ్ల పేరుతో పెద్ద స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఇళ్ల నిర్మాణానికి కేంద్రప్రభుత్వం నిధులు ఇస్తుంది.. నిధులు పక్కదారి పట్టాయన్నారు. ప్రభుత్వం చెప్పిన ధర ఒకటి ప్రభుత్వం పెద్దలు దోచుకుంది మరొకటి.. అసలు ఇళ్ల పేరుతో కేటాయించిన రూ. 23,400 కోట్లలో పెద్ద ఎత్తున దోపిడీ చేశారంటూ ఆరోపణలు చేశారు. జగనన్న ఇళ్ల పేరుతో జరిగిన అవినీతిపై ప్రధాని మోడీకి స్వయంగా తానే నివేదిక ఇస్తానని తేల్చి చెప్పారు. ప్రభుత్వ అక్రమాలను ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.

ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ కు మంత్రి జోగి రమేశ్ కౌంటర్ ఇచ్చారు. కొంతమంది పిల్ల సైకోలను వెంటేసుకుని వచ్చి గుంకలాంలో సభ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. వీకెండ్ లో ఇక్కడికొచ్చి జనాన్ని రెచ్చగొట్టి మళ్లీ హైదరాబాద్ పారిపోవడం తప్ప నువ్వు చేసేది ఏముంది? అంటూ విమర్శించారు. ఒక్కసారి గడపడపకు ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చి చూస్తే ప్రజలు మమల్ని తిడుతున్నారో, అభినందిస్తున్నారో తెలుస్తుంది అని జోగి రమేష్ హితవు పలికారు.

పవన్ కల్యాణ్ మాటలు విడ్డూరంగా ఉన్నాయని, గుంకలాంలో 12 వేల ఇళ్ల నిర్మాణం జరుగుతుంటే, అసలక్కడేమీ పనులు జరగనట్టు పవన్ మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కళ్లుంటే సరిగా చూస్తే గుంకలాంలో ఏం జరుగుతోందో కనిపిస్తుందని జోగి రమేష్ అన్నారు. గుంకలాంలో పనులు ఆగమేఘాలపై జరుగుతుండడం చూసి పవన్ కు కడుపుమంటగా ఉందని విమర్శించారు. పవన్, ఆయన దత్తతండ్రి కలిసొచ్చినా వైస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. అసలు, పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో గెలవగలడా అని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని సీట్లు ఇస్తాడో, నువ్వెక్కడ్నించి పోటీ చేయాలో ముందు అది చూసుకో. ఎక్కడ్నించి పోటీ చేయాలో చంద్రబాబుకే అర్ధం కావడంలేదు… సొంతపుత్రుడికి, దత్తపుత్రుడికి ఎక్కడ సీట్లు ఇస్తాడు? 2024లో చంద్రబాబు, లోకేశ్, పవన్ ఎవరూ గెలవరు… అసెంబ్లీలో అడుగుపెట్టరు అని స్పష్టం చేశారు.