పూంచ్ సెక్టార్ లో ఎన్ కౌంటర్..నలుగురు ఉగ్రవాదులు హతం
దక్షిణ కశ్మీర్ లో కొనసాగుతున్న దాడులు
శ్రీనగర్ః జమ్మూకశ్మీర్ లోని పూంచ్ సెక్టార్ లో నలుగురు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను భద్రతాబలగాలు కాల్చి చంపాయి. ఇండియన్ ఆర్మీకి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూకశ్మీర్ పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్ లో ముష్కరులు హతమయ్యారు. నిన్న మధ్యాహ్నం 11.30 గంటలకు ఆపరేషన్ ప్రారంభమయింది. ఆపరేషన్ లో డ్రోన్లతో పాటు, రాత్రి నిఘా పరికరాలను కూడా వినియోగించారు. ఈ తెల్లవారుజామున ఎన్ కౌంటర్ మళ్లీ ప్రారంభమయిందని… భద్రతాబలగాలు, టెర్రరిస్టుల మధ్య హోరాహోరా కాల్పులు జరిగాయని ఆర్మీ అధికారులు తెలిపారు. చనిపోయిన టెర్రరిస్టులను గుర్తించాల్సి ఉందని చెప్పారు. మరోవైపు దక్షిణ కశ్మీర్ లోని కుల్గాం, సోపియాన్, అనంతనాగ్ తదితర ప్రాంతాల్లో యాంటీ టెర్రర్ రెయిడ్స్ కొనసాగతున్నాయి. ఒక బ్యాంకు ఏటీఎం గార్డు హత్యకు గురైన నేపథ్యంలో ఈ దాడులను ఎస్ఐఏ (స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) నిర్వహిస్తోంది.